కైలాశ్ సత్యార్థి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఇంజనీరింగ్ |
వృత్తి | బాలల హక్కులు , బాలల విద్యాహక్కుల కార్యకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఉద్యమకారునిగా |
పురస్కారాలు | 2014 నోబెల్ బహుమతి రాబర్ట్ ఎఫ్. కెన్నడీ మానవ హక్కుల పురస్కారం ఇటాలియన్ సెనేట్ మెడల్ ఆల్ఫొన్సో కొమిన్ అంతర్జాతీయ పురస్కారం అంతర్జాతీయ శాంతి బహుమతి, జర్మనీ ప్రజాస్వామ్య పరిరక్షకులు పురస్కారం |
వెబ్సైటు | kailashsatyarthi.net |
కైలాస్ సత్యార్థి (జననం: 1954 జనవరి 11) ఒక భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఆయన 1980ల్లో బచ్పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడండి ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు.
ఆయన 2014 నోబెల్ బహుమతిని, మలాలా యూసఫ్జాయ్తో సంయుక్తంగా "యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా వారి పోరాటానికి, అందరు బాలలకీ కల విద్యాహక్కుకీ" పొందారు.
కైలాష్ సత్యార్థి 1954 జనవరి 11న మధ్యప్రదేశ్కు చెందిన విదీష జిల్లాలో జన్మించారు. ఆయన సామ్రాట్ అశోక టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యారు. ఆపైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ హై-ఓల్టేజ్ ఇంజనీరింగ్ విభాగంలో చేశారు. విద్యాభ్యాసం ముగించాకా కైలాష్ భోపాల్లోని కళాశాలలో అధ్యాపకునిగా కొద్ది సంవత్సరాల కాలం పనిచేశారు.
1980లో ఆయన అధ్యాపక వృత్తిని వదులుకుని, బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ (బానిసత్వ విముక్తి సంస్థ) అనే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం ప్రారంభించారు. అదే ఏడాది బచ్పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడు ఉద్యమం) ప్రారంభించారు. గ్లోబల్ మార్చి ఎగైనెస్ట్ ఛైల్డ్లేబర్ (బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అంతర్జాతీయ యాత్ర) లోనూ, ఆ కార్యక్రమానికి సంబంధించిన అంతర్జాతీయ సలహా సంఘం, అంతర్జాతీయ స్థాయిలో బాలల హక్కులకు సంబంధించిన కార్యకర్తలు, సంస్థలు, ఉద్యమకారుల ఐక్యవేదిక వంటి ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ ఛైల్డ్ లేబర్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసిసిఎల్ఈ) లోనూ కూడా ఆయన భాగస్తుడు. గ్లోబల్ కాంపైన్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థకు యాక్షన్ ఎయిడ్, ఆక్స్ఫెం, ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ సంస్థలతో పాటుగా స్థాపకునిగా వ్యవహరించడమే కాక, స్థాపించిన 1999 నుంచి 2011 వరకూ అధ్యక్షునిగా సేవచేశారు.
దీనితో పాటుగా ఆయన రగ్మార్క్ (ఇప్పుడు గుడ్వీవ్గా పేరొందింది) ను ప్రారంభించారు. రగ్మార్క్ ద్వారా దక్షిణాసియాలో బాలకార్మికులను పనిచేయించుకోని రగ్గుల తయారీ సంస్థలకు సర్టిఫికేషన్ అందజేసే నియంత్రణ సంస్థగా రూపొందింది. ఈ కోవలో ఇదే మొదటి సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ అనంతరం 80వ దశకం ఆఖరు, 90వ దశకం మొదటి సంవత్సరాలలో ఐరోపా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అంతర్జాతీయ సంస్థల్లో సామాజిక బాధ్యత కలిగిన వినిమయతత్త్వం, వ్యాపారం పట్ల బాధ్యత, జవాబుదారీతనం ఉండాల్సిన విషయంపై వినియోగదారుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రచారం చేపట్టింది. సత్యార్థి బాలకార్మిక సమస్యను మానవహక్కుల సమస్యగానే కాక సంక్షేమ విషయంగా, వితరణ చేయదగ్గ విషయంగానూ చూపారు. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఇతర సాంఘిక సమస్యలను బాలకార్మిక వ్యవస్థ శాశ్వతంగా కొనసాగేలా చేస్తుందని ఆయన వాదన, ఈ వాదనను అనేక అధ్యయనాలు సమర్థించాయి. బాలకార్మిక సమస్యపై పోరాటాన్ని "అందరికీ విద్య" సాధించే ప్రయత్నాలతో ముడిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. దీన్ని పరిశీలించేందుకు యునెస్కో ఏర్పరిచిన బాడీలో సభ్యునిగా, ఈ ప్రయత్నాలను చొరవతో వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన బోర్డు (దీన్ని ప్రస్తుతం గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఎడ్యుకేషన్గా వ్యవహరిస్తున్నారు) లో భాగస్వామిగా ఉన్నారు. సెంటర్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ (యు.ఎస్.ఎ.), ద ఇంటర్నేషనల్ లేబర్ రైట్స్ ఫండ్ (యు.ఎస్.ఎ.), ద ఇంటర్నేషనల్ కోకో ఫౌండేషన్, మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థల్లో బోర్డ్, కమిటీలో వివిధ బాధ్యతలు చేపట్టి సేవలు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి చేపట్టనున్న 2015 అనంతర అజెండా మిలీనియం డెవలెప్మెంట్ గోల్స్ (సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు) పరిధిలోకి బాలకార్మికత్వం, బానిసత్వం అంశాలను తీసుకువచ్చేందుకు పనిచేస్తున్నట్టు తెలియవస్తోంది.
బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థి 2014 నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్ కు నోబెల్ బహుమతి సంయుక్తంగా దక్కింది. నోబెల్ పురస్కారం అందుకున్న 7వ భారతీయుడు కైలాస్ సత్యార్థి. 1990 నుంచి కైలాస్ సత్యార్థి బాలల హక్కుల కోసం పాటుపడుతూ ఇంత వరకు 80వేలమంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కైలాస్ గ్లోబల్ మార్చి కూడా నిర్వహించారు. ఆయన రుగ్మక్ అనే సంస్థను స్థాపించి బాలల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన ఆయన బాలల హక్కుల కోసం అవిరాళ పోరాటం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కైలాశ్ సత్యార్థి న్యూఢిల్లీలో నివసిస్తూ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పోరాటాలకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.