సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంగా, భూమి, ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరుగుచున్నవని వివరించే ఖగోళశాస్త్ర నమూనా. అంతకు ముందు టోలెమీ ప్రవేశ పెట్టిన భూకేంద్రక సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమైనది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే భావనను సా.పూ 3 వ శతాబ్దంలోనే అరిస్టార్కస్ ఆఫ్ సామోస్ ప్రతిపాదించాడు. కానీ మధ్యయుగంలో మాత్రం ఈ భావనకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. బహుశ ఈ భావనను నిరూపించేందుకు అవసరమైన శాస్త్ర పరిశోధనలేమీ జరగకపోవడం ఇందుకు కారణం కావచ్చు.[lower-alpha 1]
16 శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన సమయానికి గణిత శాస్త్రవేత్త, ఖగోళవేత్త, క్యాథలిక్ క్లెరిక్ అయిన నికోలాస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతానికి గణిత నమూనా తయారు చేసాడు. దీని తర్వాతి శతాబ్దంలో జొహన్నెస్ కెప్లర్ దీర్ఘవృత్తాలతో కూడిన గ్రహ గమన నియమాలు రూపొందించాడు. గెలీలియో టెలిస్కోపు ద్వారా పరిశీలించి అందుకు అనువైన పరిశీలనలు చేశాడు.
విలియం హెర్షెల్, ఫ్రెడెరిక్ బెస్సెల్, ఇంకా మరికొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించిన మీదట సౌర వ్యవస్థకు సూర్యుడు కేంద్రంగా ఉన్నప్పటికీ విశ్వానికంతటికీ మాత్రం సూర్యుడే కేంద్రమని చెప్పలేమని ఋజువైంది.
పాదపీఠికలు
సూచనలు